అఖండకు విపరీతంగా హైప్.. బోయపాటి ముంచుతాడా, తేల్చుతాడా..!

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా వస్తున్న సినిమా అఖండ. ఇదివరకు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా బాలకృష్ణ గత సినిమాల కంటే రికార్డు స్థాయిలో చేసింది. ఈ సినిమా దాదాపు రూ 60 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

అఖండ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు. మరో ముఖ్య పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లో ఎప్పుడూ లేనంత హైప్ తో విడుదల కానుంది. దీనికి కారణం బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ విజయాలే. దానితోడు అఖండ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

ఇవాళ హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా చీఫ్ గెస్ట్ లుగా అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి హాజరవనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ ఈవెంట్ కూడా అఖండ సినిమాకు హైప్ తీసుకు వస్తోంది. గతంలో సింహా సినిమా విజయం తర్వాత బోయపాటి- ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ హైప్ తో వచ్చిన దమ్ము సినిమా అభిమానులను కూడా ఆకట్టుకోలేదు.

అలాగే సరైనోడు సూపర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను -చరణ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన వినయ విధేయ రామ డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు అఖండ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాను బోయపాటి శ్రీను ముంచుతాడా, తేల్చుతాడా అని నందమూరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.