కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ అక్టోబర్ 29వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఇక బతికున్నన్ని రోజులు ఎంతో మందికి తన సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించిన పునీత్.. మరణాంతరం కూడా ఇతరులకు ఉపయోగపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పునీత్ ఆకాంక్ష మేరకు చనిపోయిన తర్వాత ఆయన రెండు కళ్లనూ కుటుంబీకులు దానం చేసి మంచి మనసు చాటుకున్నారు. అయితే ఇప్పుడాయన నేత్రదానంతో నలుగురికి కంటి చూపు వచ్చింది. పునీత్ మరణించిన రోజే నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్ కళ్లను సేకరించారు. అనంతరం వాటిని నలుగురు యువతకు అమర్చినట్లు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు.
రెండు కళ్లు.. నలుగురికి అమర్చడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఈ విషయంపై కూడా భుజంగశెట్టి క్లారిటీ ఇచ్చారు. అధునాతన సాంకేతికతో ఒక్కో కార్నియా (నల్లగుడ్డు)ను పైపొర, లోపలి పొరగా విభజించి.. పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు, లోపలి పొరను సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వైద్యులు తెలిపారు. ఇక ఒక వ్యక్తి చేసిన నేత్రదానంతో నలుగురికి చూపు రావడం అనేది అరుదైన ఘటన అని..అది పునీత్ కళ్లతో జరిగిందని వైద్యులు తెలిపారు.