నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తిన కానిస్టేబుల్…?

ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను పోలీస్ కావడంతో తనని ఎవరూ అడగరు అనుకున్నాడేమో ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతని బండారం బయట పెట్టింది. దీంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళ్తే… అప్పలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా సిసిఆర్బి లో పని చేస్తున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా నలుగురు పిల్లలను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అంతేకాకుండా ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అంతేకాక నలుగురిలో పద్మ అనే మహిళకు నాలుగు సార్లు అబార్షన్ చేయించడంతో ఆమెకు అప్పలరాజు పై అనుమానం వచ్చింది. అయినా కూడా అక్కడితో ఆగకుండా కానిస్టేబుల్ మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న పద్మ హెడ్కానిస్టేబుల్ అప్పల్రాజు నిలదీయడంతో అప్పలరాజు రెచ్చిపోయి ఆమెను వేధించడం బెదిరించడం ప్రారంభించాడు.

వేధింపులు ఎక్కువవడంతో పద్మ మహిళా సంఘాల సహకారంతో విశాఖలోని దిశ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా నలుగురు మహిళలను పెళ్లాడినట్టు తెలిసింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడని, అప్పల రాజును అరెస్ట్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.