పునీత్ కడచూపునకు లక్షలాదిగా ఫ్యాన్స్ .. మార్మోగుతున్న పవర్ స్టార్ నినాదాలు..!

నిన్న ఉదయం కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో కన్నడనాట విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇవాళ సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్న నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగళూరులోని కంఠీరవ స్టేడియం లో ఉంచారు. పునీత్ కడచూపు కోసం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది అభిమానులు బెంగళూరు చేరుకున్నారు.

స్టేడియం వద్ద లక్షలాదిగా అభిమానులు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. ఇన్నెళ్లు సినిమాలతో తమను అలరించిన స్టార్ హీరో ఇక లేడని.. దుఃఖంతో కన్నీరు పెడుతున్నారు. పునీత్ మృతిని ఇప్పటికి కూడా అభిమానులు నమ్మలేకపోతున్నారు. లక్షలాదిగా స్టేడియం వద్దకు తరలివచ్చిన అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగి పోతోంది.

ఇవాళ సాయంత్రం పునీత్ కు తన తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు అంత్యక్రియలు జరిగిన చోటే అంత్యక్రియలు జరపనున్నారు. పునీత్ కు తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు తో సత్సంబంధాలు ఉండడంతో ఆయన కడచూపు కోసం పలువురు నటీనటులు బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి కూడా పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయానికి నివాళులర్పించారు.

 

https://twitter.com/XpressBengaluru/status/1454326027811844097?s=08