రెండ్రోజులుగా శ్రీకాళహస్తిలోనే సమంత..కాపురాన్ని నిలబెట్టుకునేందుకు పూజలు ..!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు శ్రీ కాళహస్తిలో వెలసిన ముక్కంటీశ్వరుడు అంటే అపారమైన భక్తి, నమ్మకం. తెలుగులో ఆమె హీరోయిన్ గా పరిచయం అయినప్పటి నుంచి శ్రీకాళహస్తికి తరచూ వచ్చి వెళ్తున్నారు. ప్రస్తుతం సమంత శ్రీకాళహస్తిలో రెండు రోజులుగా మకాం వేసింది. సమంత,అక్కినేని నాగచైతన్య కొన్నేళ్ల కిందట పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారంటూ పుకార్లు చెలరేగుతున్నాయి.

సమంత ట్విట్టర్ లో సమంత అక్కినేని గా ఉన్న తన పేరును జస్ట్ ‘ఎస్’ గా మార్చుకోవడం, ఇటీవలి కాలంలో ఎక్కడా కూడా సమంత,నాగచైతన్య కలిసి కనిపించకపోవడంతో సామ్, చైతూ విడి పోతున్నారనే వదంతులు తీవ్రమయ్యాయి. సమంత, నాగచైతన్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో అయితే చైతన్య, సమంత విడాకులపై కుప్పలుతెప్పలుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయమై నాగచైతన్య కానీ, సమంత కానీ వీటిని ఖండించడం లేదు. దీంతో చాలామంది వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నది నిజమేనని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత నిన్న శ్రీకాళహస్తి కి వచ్చింది. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత తిరిగి శ్రీకాళహస్తి కి చేరుకుంది.నిన్న మధ్యాహ్నం నుంచి శ్రీకాళహస్తి లో సమంత వరుసగా పూజలు చేస్తోంది.

మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసిన సమంత నాగ దోషం, నవగ్రహ దోషం, శత్రు దోషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల,నరదిష్టి,రుద్ర హోమం, చండీ హోమం కూడా చేస్తోంది. ముఖ్యంగా దాంపత్య సమస్యల పరిష్కారం కోసమే సమంత ఈ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.