హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. ఆసుపత్రిలో చేరిక!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. తన స్పోర్ట్స్ బైకు నుండి కిందపడిపోవడంతో తేజుకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తేజు ప్రమాదానికి గురవడంతో స్థానికులు వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా తేజు గాయాలకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

దీంతో తేజుకు లోపలి భాగంలో ఏమైనా తీవ్ర గాయాలు తగిలాయా అనే సందేహంతో అతడికి పలు స్కాన్‌లు చేస్తున్నారు వైద్యులు. ఇక తేజు ఛాతి భాగంలో, కుడికన్ను పైన, పొట్ట భాగంలో గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. ఇక తేజును ప్రస్తుతం మాధాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్ర అందిస్తున్నారు వైద్యులు. ఈ వార్త తెలుసుకున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని, తేజు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.

ప్రస్తుతం తేజు బాగానే ఉన్నాడని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు అంటున్నాయి. ఇక మెగా ఫ్యాన్స్ ఎవరూ తేజు ఆరోగ్యం గురించి భయపడాల్సిన పనిలేదని, ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.