దేశంలో మరో వైరస్ వ్యాప్తికి ప్రయత్నం.. చెన్నై విమానాశ్రయానికి విష పురుగుల పార్శిల్..

చైనాలోని వుహాన్ ల్యాబ్ ద్వారా లీకైన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించి అతలాకుతలం చేస్తోంది. వైరస్ వ్యాప్తి కారణంగా లక్షలాదిగా ప్రాణ నష్టం జరగడంతో పాటు ఆర్థికంగా కూడా చాలా దేశాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఇప్పటికే కోవిడ్ రెండు వేవ్ లను చాలా దేశాలు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ ఉంటుందన్న భయాందోళనలతో అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ నే ఎదుర్కోలేక మన దేశం కూడా సతమతమవుతుండగా తాజాగా దేశంలోకి మరో వైరస్ ను వ్యాప్తి చేసే ప్రయత్నం జరగడం కలకలం రేపుతోంది.

గురువారం రాత్రి ఆఫ్రికా దేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి ఒక విమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా విమానంలో వచ్చిన పార్శిళ్లను పరిశీలించారు. ఆ పార్శిళ్లల్లో ప్రమాదకరమైన వైరస్ ను వ్యాప్తి చేసే స్వభావం ఉన్న వందలాది విష పురుగులు కనిపించడంతో అధికారులు బిత్తరపోయారు. ఆ పురుగులు బయటకు రాకుండా వెంటనే పార్శిళ్లను మూసివేశారు.

ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన అన్ని పార్శిళ్లను అదే విమానంలోనే ఉంచి తిరిగి పంపేశారు. విమానాశ్రయానికి వచ్చిన ఈ పార్శిళ్లు.. ఎవరెవరి పేరు మీద వచ్చాయి. వీటిని ఎవరు పంపారు… అనే కోణంలో దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా కేసుల విజృంభణతో దేశం అల్లాడుతుండగా మరో వైరస్ వ్యాప్తి చేసే ప్రయత్నం చేయడం కలకలం రేపుతోంది.