`రిపబ్లిక్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ ప్రభుత్వంపై, మంత్రులపై పవర్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, పోసానిల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగు ఫిలిం ఛాంబర్ తమకు పవన్ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదంటూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దాంతో సినీ ప్రముఖులు ఎవరూ నేరుగా ఈ విషయంపై రియాక్ట్ కావడం లేదు.
ఎవరికి అనుకూలంగా మాట్లాడితే.. ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో అనే ఆందోళన వీరిలో ఉంది. ఇలాంటి తరుణంలో కింగ్ నాగార్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. లవ్ స్టోరీ మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న నాగార్జున.. సినిమా సక్సెస్ సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు ప్రేక్షకులు సినిమాను ఎంతో ప్రేమిస్తారని వ్యాఖ్యానించిన నాగార్జున.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల దీవెనలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని అన్నారు.
రెండు ప్రభుత్వాలు ఇప్పటి వరకు తమకు ఎంతగానో సహకరించాయని తెలిపారు. భవిష్యత్తులోనూ వారి చల్లని చూపు కొనసాగాలని నాగార్జున కోరారు. దాంతో అటు పవన్కి మద్దతిచ్చినట్టు కాకుండా, ఆయన్ని నేరుగా వ్యతిరేకిస్తున్నట్టూ చేయకుండా నాగ్ చాలా తెలివిగా మాట్లాడారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే నాగార్జున పరోక్షంగా ఏపీ ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరిని చూపించడం పవన్కు షాక్ తగిలినట్టైంది.