హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్యకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుండగా.. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
అయితే ఈ రోజు ఉదయం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. బాధితురాలి కుటుంబ సభ్యులను స్వయంగా వెళ్లి పరామర్శించారు. అనంతరం మనోజ్ మీడియాలో మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. `ఈ క్రూరమైన సమాజంలో బతుకుతున్న మనమంతా బాధ్యతాయుతంగా ఉండాలి. మగాడి ఆలోచన మారాలి. ఆడపిల్లలను ఎలా గౌరవించాలో తెలుసుకోవాలి.
ఇప్పటికీ నిందితుడి జాడ దొరకలేదని పోలీసులు అంటున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం, పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ నీచుడిని 24 గంటల్లో ఉరి తీసి..బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలి` అంటూ మనోజ్ డిమాండ్ చేశారు. అలాగే చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని మనోజ్ తెలిపాడు.