బాలయ్య మంచితనం.. పసిప్రాణం కోసం ఏం చేశాడంటే?

నందమూరి బాలకృష్ణ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ అభిమానిని కొట్టిన బాలయ్య, ఈ పని చేసిన బాలయ్య అంటూ మీడియా ఎంతసేపూ ఆయన్ని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయితే బాలయ్యలోని మంచితనం కూడా నిత్యం వార్తల్లో నిలిస్తూ ఉంటుంది. తాజాగా బాలయ్య తన మంచిమనసును మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారిని అక్కున చేర్చుకున్నాడు ఈ నందమూరి హీరో.

మల్యాజ్‌గిరికి చెందిన మణిశ్రీ అనే 7 ఏళ్ల పాపకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి ఆపరేషన్‌కు వైద్యులు రూ.7 లక్షల ఖర్చు అవుతుందని తెలిపారు. అయితే మణిశ్రీ తల్లిదండ్రులు చాలా కష్టపడి రూ.1.80 లక్షలు మాత్రమే సమకుర్చగలిగారు. ఇక చేసేదేమీ లేక బాలయ్య అభిమానులను సహాయం చేయాల్సిందిగా సంప్రదించారు. దీంతో బాలయ్య అభిమానులు ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఆపరేషన్ కోసం ఏర్పాట్లు చేయాలని, మిగతా డబ్బును తానే భరిస్తానని వైద్యులకు సూచించారు. దీంతో మణిశ్రీ తల్లిదండ్రులు బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇలా ఓ పసిప్రాణం కోసం రూ.5.80 లక్షల ఆర్థిక సాయాన్ని అందించిన బాలయ్య ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ఇష్టపడ్డారు. అయితే అభిమానులు మాత్రం తమ హీరో చేస్తున్న సామాజిక సేవ గురించి అందరికీ తెలియాలని ఈ విషయాన్ని తెలియజేశారు. ఏదేమైనా బాలయ్యలోని మంచి మనసు మరోసారి బయటపడటంతో ఆయన అభిమానులు బాలయ్యకు జై కొడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే బాలయ్య నటించిన అఖండ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.