సోడా సెంటర్‌కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్‌గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం.

కాగా ఈ సినిమాలో సుధీర్ బాబు చాలా మాస్ లుక్‌లో మనకు దర్శనమిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తరకెక్కిస్తున్నాడు దర్శకుడు కరుణ కుమార్. అయితే తాజాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మంచి రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. శ్రీదేవి సోడా సెంటర్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ ఏకంగా రూ.12 కోట్లకు సొంతం చేసుకున్నారట. ఈ సినిమాకు ఈ స్థాయిలో రైట్స్ అమ్ముడు కావడం నిజంగా విశేషమనే చెప్పాలి.

ఇక ఈ సినిమాను ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాతో సుధీర్ బాబు ఖచ్చితంగా హిట్ కొడతాడని ఆయన అభిమానులతో పాటు చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.