అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల.

ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ చిత్రం ‘లూసిఫర్’రీమేక్‌ను ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత మరె రెండు సినిమాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు చిరు. ఇందులో ఒకటి దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. మెహర్ రమేష్ సినిమాలంటేనే భయపడే ఆడియెన్స్, చిరంజీవి లాంటి స్టార్ ఆయనతో సినిమా చేయడం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. అయితే తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళం చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్ రీమేక్ చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ మెహర్ రమేష్‌కు అప్పగించాడు చిరు.

కాగా ఈ సినిమా కోసం మెహర్ రమేష్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కోల్‌కతా వెళ్లి అక్కడ దసరా వేడుకలకు సంబంధించిన లైవ్ విజువల్స్‌ను టెస్ట్ షూట్ చేసినట్లు చిత్ర వర్గాల్లో టాక్. ఈ టెస్ట్ షూట్ కోసం ఏకంగా రూ.30 లక్షల ఖర్చు కూడా అయ్యిందట. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఎలివేషన్‌ను మరో లెవెల్‌లో చూపించేందుకు మెహర్ రమేష్ రెడీ అవుతున్నాడట. కాగా సిస్టర్ సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో చిరుకు సోదరిగా ఓ స్టార్ బ్యూటీ నటిస్తోందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ సినిమాతో మెహర్ రమేష్ ఎలాంటి రిజల్ట్‌ను రాబడతాడో చూడాలి.