భార‌త్‌లో కొత్త‌గా 44,658 కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్య‌ధికం!!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే గ‌త మూడు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మ‌ళ్లీ భారీగా న‌మోదు అవుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 44,658 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188 కు చేరుకుంది. అలాగే నిన్న 496 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,36,861 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 32,988 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,18,21,428 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,44,899 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 18,24,931 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు. కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ నుంచే అత్య‌ధికంగా వ‌స్తున్నాయి. తాజా కేసుల్లో సైతం 30,007 పాజిటివ్ కేసులు కేర‌ళ‌లోనే న‌మోదు అయ్యాయి.