ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
అయితే గత రెండు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 46,164 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530 కు చేరుకుంది. అలాగే నిన్న 607 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,36,365 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 34,159 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 3,17,88,440 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,33,725 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశవ్యాప్తంగా 17,87,283 కరోనా టెస్ట్లు నిర్వహించారు.