కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి.
గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,869 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 385 కేసులు, అతి స్వల్పంగా కర్నూలు జిల్లాలో 10 కేసులు నమోదు అయ్యాయి.
దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 19,87,051 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 18 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,582 దగ్గర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 2,316 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,55,052 కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 18,417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్నొక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 71,030 కరోనా టెస్ట్లు నిర్వహించారు.