సామాన్యుల మాదిరిగానే సినీ తారల జీవితాల్లోనూ ఎన్నో సమస్యలు ఉంటాయి.. మరెన్నో చేదు అనుభవాలూ ఉంటాయి. వాటిని కొందరు బయట పెడతారు.. మరికొందరు తమలోనే దాచుకుంటూ కుమిలిపోతుంటారు. అయితే తాజాగా యంగ్ హీరోయిన్ అదితి రావు హైదరీ తన లైఫ్లో జరిగిన ఓ చేదు సంఘటనను అందరితోనూ పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిది.. తాను చదువుకునే రోజుల్లో జరిగిన ఓ సంఘటనను అందరితోనూ షేర్ చేసుకుంది. `ఓ సారి లోకల్ ట్రైన్ లో వెళ్తుండగా.. ఓ వ్యక్తి తనను తాకకూడని చోట తాకాడు. మొదట పొరపాటున జరిగిందేమో అని భావించాను. కానీ, సదరు వ్యక్తి మళ్లీ మళ్లీ అలాగే చేస్తుండడంతో.. అతడి చెంప పగలగొట్టి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చాను` అని అదితి చెప్పుకొచ్చింది. అలాగే ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి విషయాలపై అవగాహన కల్పించాలని ఆమె పేర్కొంది.
కాగా, హైదరాబాదీ అయిన అదితి.. మొదట మలయాళ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్లో అధిక చిత్రాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అలాగే తెలుగులో సుధీర్ బాబు సరసన సమ్మోహనం, నాని సరసన వి, వరుణ తేజ్ సరసన అంతరిక్షం వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ మహాసముద్రం, హే సినామిక చిత్రాల్లో నటిస్తోంది.