ఒక్క పోస్ట‌ర్‌తో రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన `ఖిలాడీ` టీమ్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లో ఖిలాడీ ఒక‌టి. రమేష్ వర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మ‌ధ్య ఖిలాడీ షూటింగ్ ఆగిపోయిందంటూ జోరుగా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌ట్లో ఈ మూవీ ప‌ట్టాలెక్కే ఛాన్స్ లేద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. అయితే తాజాగా ఈ వార్త‌లు కేవ‌లం పుకార్లే అని తేల్చేసింది ఖిలాడీ టీమ్‌.

ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల 26వ తేదీ నుంచి మొదలుకానుందనే విషయాన్ని తెలుపుతూ.. తాజాగా ఓ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ ర‌వితేజ సూప‌ర్ స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. కాగా, ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` అనే మ‌రో చిత్రం చేస్తున్నాడు. శరత్ మందవ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది.