బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్ల్లో అప్లోడ్ చేసిన కేసులో పోలీసులు రాజ్ కుంద్రాను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరిలో నమోదైన ఈ కేసులో ప్రధాన కుట్రదారుగా రాజ్ కుంద్రానే ఉన్నాడని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలె తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఈ కేసులో మొత్తంగా 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన కమీషనర్.. కుంద్రాకు వ్యతిరేకంగా స్పష్టమైన సాక్ష్యాధారాలున్నాయని, దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.
అయితే తాను ఏ తప్పు చేయలేదని రాజ్ కుంద్రా పేర్కొన్నారు. మరియు ముందస్తు బెయిల్ కోపం అప్లై చేశాడు. కాగా, గతంలో ఐపీఎల్ బెట్టింగులు, బిట్ కాయిన్ కుంభకోణం ఇతర విషయాల్లో రాజ్కుంద్రాపై పలు కేసులు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఆయన అశ్లీల చిత్రాలకు సంబంధించిన కేసులో ఇరుక్కోవడంతో.. బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాడు.