సజ్జలకు ప్రమోషన్ .. కేబినెట్ మినిస్టర్ గా ఛాన్స్?

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి జాక్ పాట్ కొట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో సజ్జలకు అవకాశం దక్కనున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష పార్టీ వ్యవహారం వల్లే ఆయనకు ఈ అవకాశం దక్కనుంది. అదేంటి..ప్రతిపక్ష పార్టీ వల్ల మంత్రి పదవి ఎలా వస్తుంది అనుకోకండి. అసలు విషయమేమంటే.. ప్రభుత్వ సలహాదారుగా సజ్జల ఎప్పుడూ మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటారు.

ముఖ్యమంత్రి జగన్ ను, ప్రభుత్వ పథకాలను మెచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను తనదైన శైలిలో కడిగి పారేస్తుంటారు. దీంతో అపోజిషన్ పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కాక.. ఒక ప్రభుత్వ సలహాదారు రాజకీయాలు ఎలా మాట్లాడతారు? అదీ నేరుగా మీడియా సమావేశాల్లోనే రాజకీయ పార్టీలను విమర్శించడం ఏంటి? ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటూ అధికార పార్టీ చేసే రాజకీయాలను ప్రోత్సహించడమే కాక డైరెక్ట్ గా తనే పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారనే లా పాయింటును లేవదీసింది. అంతేకాక మొత్తం సలహాదారు వ్యవస్థపైనే కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు.. ప్రభుత్వ సలహాదారులపై ఆరా తీసింది. అసలు సలహాదారులు రాజకీయ వ్యాఖ్యలు చేయవచ్చా అని సర్కారును ప్రశ్నించింది. ఇదే సజ్జలకు కలిసి వచ్చింది. దీంతో అధినేత.. ఎటువంటి ఇబ్బంది లేకుండా..ఎవరూ విమర్శించకుండా సజ్జలను నేరుగా కేబినెట్ లోకి తీసుకొని కీలక పదవి అప్పగించే పనిలో ఉన్నారని తెలిసింది. ఇది నిజమే అయితే.. సజ్జల లక్కీ ఫెలోనే..!