ఈట‌ల స్థానంలో వ‌రంగ‌ల్ నేత‌కు మంత్రి ప‌ద‌వి..!

భూక‌బ్జా వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద నుంచి వైద్య ఆరోగ్య‌శాఖల‌ను త‌ప్పించారు. వాటిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న వ‌ద్ద‌నే ఉంచుకున్నారు. రాజేంద‌ర్‌ను కేవ‌లం శాఖ‌లు లేని మంత్రిగానే కొన‌సాగిస్తున్నారు. రేపో మాపో పార్టీ నుంచి సైతం బ‌హిష్క‌రించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, రాజ‌కీయ అడుగుల గురించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాన‌ని తెలిపిన ఈట‌ల షామిర్‌పేట‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డే త‌న అనుచ‌రుల‌తో స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఈట‌లతో ఖాళీ అయిన మంత్రివ‌ర్గంలోని స్థానాన్ని వ‌రంగ‌ల్ జిల్లా ముఖ్య నేత‌ల్లోని ఒక‌రితో భ‌ర్తీ చేయాల‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లుగా వాట్సాప్‌ల్లో ఓ మెస్సేజ్ వైర‌ల్ అవుతోంది. ముఖ్యమంత్రి కార్యాల‌యం అధికారుల నుంచి ఇప్పటికే ఆ జిల్లా టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు ఫోన్లు వెళ్లిన‌ట్లు ప్ర‌చారం కొన‌సాగుతున్న‌ది. ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌న్న ప్రచారంతో టీఆర్ ఎస్ వ‌ర్గాల్లో ఉత్కంఠ నెల‌కొంటోంది. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ప‌నిచేస్తున్న వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ విన‌య్ భాస్కర్‌, న‌ర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి పేర్లు మ‌ధ్య ప్రధానంగా పోటీ నెల‌కొన్నట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది.