దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రస్తుతం పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పైనే ఉన్నాయి. అక్కడ ఎన్నికలు ఉత్కంఠగా కొనసాగాయి. బీజేపీ, టీఎంసీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ నడుస్తున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఇరు పార్టీల మధ్య స్వల్ప సంఖ్యలోనే తేడాలు ఉండడంతో మరింత ఉత్కంఠత రేపుతున్నది. మొత్తంగా 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా తీవ్ర కాక రేపుతున్నాయి. క్షణం క్షణం ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఆది నుంచి టీఎంసీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్థులు కూడా అదే రేంజ్లో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా టీఎంసీ అధినాయకురాలు, ముఖ్యమంత్రి ఈసారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన క్యాండిడేట్ సువేంధు అధికారిపై ఆమె పోటీకి దిగారు. అయితే అక్కడ ఓట్ల ఫలితాలు ఉత్కంఠగా మారాయి. తొలిరౌండ్ ఫలితాల్లో మమత వెనకబడిపోవడం గమనార్హం. 1500 ఓట్ల స్వల్ప మెజార్టీతో సువేందు అధికారి దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్ లోనూ సువేంధు మమతను బీట్ చేశారు. కౌంటింగ్ మొదలైన తొలి అరగంట పాటు వెనుకబడిన మమతా తిరిగిపుంజుకున్నారు. ప్రస్తుతం మళ్లీ వెనుకంజలో కొనసాగుతున్నారు. హోరాహోరిగా సాగుతున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారో తెలియాలంటే చివరి రౌండ్ వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.