మెగా ఆఫ‌ర్ ప‌ట్టిన ఎన్టీఆర్ హీరోయిన్‌?

మమతా మోహన్ దాస్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన యమ‌దొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మ‌మ‌తా.. న‌టిగానే కాకుండా సింగ‌ర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న స‌మ‌యంలో ఈ బ్యూటీ అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా సడన్‌గా కనుమరుగయ్యారు.

మ‌ళ్లీ చాలా ఏళ్ల త‌ర్వాత మ‌మ‌తా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మ‌రికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో ఉన్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ అమ్మ‌డును మెగా ఆఫ‌ర్ వ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సినిమాలో నటించేందుకు మెగా కాంపౌండ్ నుంచి ఈమెకు పిలుపొచ్చిందట. ప్ర‌స్తుతం ఆచార్య చేస్తున్న‌ చిరు.. ఆ త‌ర్వాత మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో లూసీఫర్ రీమేక్‌, మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. మ‌రి వీటిలో ఏ చిత్రానికి మ‌మ‌తా సెలెక్ట్ అయిందో తెలియాల్సి ఉంది.