తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఐదు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోగా కొనసాగుతున్న ఈయనకు టాలీవుడ్లో కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోంగ్ ఉంది. అయితే ఎంత క్రేజ్ ఉన్నా.. ఈయన మాత్రం చాలా సింపుల్గా ఉంటారు.
సాయం చేసే గుణం కూడా ఈయనకు ఎక్కువే. ముఖ్యంగా కరోనా సమయంలో ఎందరికో సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు అజిత్. అయితే అజిత్ను ఇన్స్పెరేషన్ గా తీసుకుని ఆయన ఫ్యాన్స్ కూడా గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్ను అదుపు చేసేందుకు లాక్డౌన్ విధించడంతో నిరుపేదలు పని లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా అజిత్ అభిమానుల్లో కొందరు పుదుచ్చేరిలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు, అరటి పండ్లు, బిస్కెట్ల ప్యాకెట్లతో కూడిన బండ్లను రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు. ఆకలి వేసిన వారు వచ్చి ఆహారాన్ని తీసుకుని తినొచ్చు అనే పోస్టర్లను అంటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. అజిత్ ఫ్యాన్స్పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.