దేశంలో కరోనా వైరస్ మళ్లీ స్వయం విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతోంది. దీంతో రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సరైన సదుపాయాలు లేక కరోనా బాధితులు నానా ఇబ్బందులు పడుతున్నాయి. అయితే వారిని అదుకునేందుకు చాలా మంది దాతలు సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ టీమ్లు ముందుకు వచ్చాయి. తాజాగా రాజస్తాన్ రాయల్స్ కరోనా బాధితుల కోసం రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇందులో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, టీమ్ యాజమాన్యం అందరి భాగస్వామ్యం ఉన్నట్లు రాయల్స్ ప్రకటించింది. తాము ఇచ్చిన నిధులు ప్రధానంగా రాజస్తాన్ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. ఆక్సీజన్ సిలిండర్లు,వైద్య సహాయం లేక ఇబ్బంది పడుతున్న వారికి ఈ విరాళం ఉపయోగించనున్నారు.