కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఆ జిల్లాలో కంప్లీట్ లాక్‌డౌన్..!

ఛత్తీస్‌గఢ్‌లో రోజు రోజుకు కరోనా కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో అక్కడ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో ఒక వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు దుర్గ్‌ జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే తెలిపారు. ఇప్పటికే ఆ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.

దుర్గ్‌తోపాటు బస్తర్‌, మహాసముంద్‌, రాజ్‌నంద్‌గావ్‌, రాయగఢ్‌, రాయ్‌పూర్‌, కొరియా, సుక్మా జిల్లాల్లో గత మంగళవారం నాడు నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు అక్కడ. ఛత్తీస్‌గఢ్‌లో నిన్న ఒక్క రోజులోనే 4617 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,53,804కు చేరగా, ఇందులో 3,20,613 మంది కరోనా నుంచి కోలుకోగా, 28,987 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4204 మంది మృత్యువాత పడ్డారు.