తెలుగు సినీ ఇండస్ట్రీలో యువరత్న నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున ఇద్దరూ ఇద్దరే. దివంగత లెజెండ్రీ నటులు అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చిన వీరు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ తమ సత్తా చాటారు. అయితే గత నాలుగేళ్లుగా బాలయ్య-నాగార్జున మధ్య విబేధాలు ఉన్నట్టు వార్త ఒకటి ఇండస్ట్రీలో ఉంది. ఏఎన్నార్ చనిపోయినప్పుడు ఇండస్ట్రీ జనాలందరూ వచ్చినా బాలయ్య మాత్రం రాలేదు. ఆ తర్వాత ఈ గ్యాప్ వార్తలకు మరింతగా ఊతం వచ్చింది.
అయితే మొన్నా మధ్య విశాఖలో జరిగిన సుబ్బరామిరెడ్డి 40 ఇయర్స్ కార్యక్రమంలో మోహన్బాబు బాలయ్య, నాగార్జున ఇద్దరిని ఒకేసారి వేదిక మీదకు పిలిచి అందరికి షాక్ ఇచ్చారు. అక్కడ బాలయ్య-నాగ్ హగ్ చేసుకుని చాలా వరకు వీరి గ్యాప్ అనుమనాలను పటాపంచలు చేశారు. నాగ్ అయితే బాలయ్యతో తనకు విబేధాలు ఉన్నాయని వస్తోన్న వార్తలను కొట్టిపడేశాడు కూడా..!
అయితే ఇప్పుడు మరోసారి వీరి మధ్య గ్యాప్ లేదన్న అంశం స్పష్టమైంది. నాగ్ పెద్ద కుమారుడు చైతు – హీరోయిన్ సమంత పెళ్లి ఈ నెల 6న గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి నాగ్ కేవలం 100 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించాడు. ఈ లిస్టులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నాడని తెలుస్తుంది. బాలయ్యని నాగార్జున ప్రత్యేకంగా ఆహ్వానించాడని… బాలకృష్ణ కూడా పెళ్ళికితప్పక వస్తానని చెప్పినట్లుగా టాక్.
ఈ పెళ్లికి చిరు, చెర్రీ, బన్నీ, ఎన్టీఆర్, మహేష్బాబు వస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లికి ఎంతమంది సెలబ్రిటీలు వచ్చినా బాలయ్య వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. బాలయ్య – నాగ్ గ్యాప్ ఈ దెబ్బతో పటాపంచలు కావడం ఖాయం.