2019 ఎన్నికలకు ఇంకా గట్టిగా యేడాదిన్నర టైం కూడా లేదు. అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాల్లోను రాజకీయం హీటెక్కిస్తోంది. ఈ క్రమంలోనే జంపింగ్లు, కప్పుల తక్కెడలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన ఓ మాజీ మంత్రి పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే సదరు మాజీ మంత్రి ఏపీకి చెందిన వారు కాదు తెలంగాణకు చెందిన వారు కావడం విశేషం.
తెలంగాణలో టీడీపీ ఇప్పటికే అస్థిత్వం కోసం ఫైట్ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు ఉంటారో ? లేదో ? కూడా చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలోనే అక్కడ పార్టీకి ఉన్న కొద్ది మంది పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారు. ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్గా ఉన్న రేవంత్రెడ్డి లాంటి వాళ్లే కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న టాక్ ఉండనే ఉంది.
ఇక ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీకే చెందిన ఓ మాజీ లేడీ మంత్రి కూడా పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్? మాజీ హోం మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి సతీమణి, మాజీ మంత్రి…తెలుగుదేశంపార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్లోకి వెళుతున్నారట. ఇప్పటికే ఆమె తన ముఖ్య అనుచరులతో సమావేశం అయ్యారు కూడా.
మూడు దశాబ్దాలుగా భువనగిరి నియోజకవర్గంలో బలమైన పట్టు సాధించిన మాధవరెడ్డి కుటుంబానికి గట్టి పట్టు ఉంది. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ ఇన్నర్ కారిడార్లో ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్లోకి వెళుతున్నారన్న వార్త పెద్ద హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ నాయకులు కూడా ఆమెను పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంలో ఉండి సరిగా ఫైట్ చేయలేకపోతోన్న కాంగ్రెస్కు ఉమా మాధవరెడ్డి లాంటి బలమైన నాయకుల కొరత ఉంది. ఈ క్రమంలోనే ఉమా మాధవరెడ్డిని పార్టీలోకి తీసుకునేందుకు టీ కాంగ్రెస్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.