వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు చెక్ చెప్పేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుంచి ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీవిశ్వనాథ్ను రంగంలోకి దించబోతు న్నారు. టీడీపీలో చేరేందుకు వాణివిశ్వనాథ్ కూడా ఆసక్తిగా ఉండటంతో.. ఇప్పుడు నగరిలో స్టార్ హీరోయిన్ల వార్ తప్పదనే ప్రచారం జోరందుకుంది. ఆమె స్థానికురాలు కావడం ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రోజా కొత్త ఎత్తు వేశారు. స్థానికురాలిగా గుర్తింపు తెచ్చుకుని, ప్రజల్లో మమేక మయ్యేందుకు నగరిలో సొంతింటిని నిర్మించుకుంటున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు. ఇతర టీడీపీ నేతలపై నిత్యం ఫైర్ అయ్యే రోజా దూకుడుకు అడ్డుకట్ట వేయాలని టీడీపీ అధిష్టానం ఎప్పటినుంచో సరైన సమయం కోసం వేచిచూస్తోంది. వెదకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టుగా.. వారికి వాణి విశ్వనాథ్ రూపంలో ఆయుధం దొరికింది. టీడీపీలోకి వచ్చి నగరి నుంచి పోటీచేస్తానని ఆమె ప్రకటించడంతో.. టీడీపీ అధిష్టానానికి ఎనలేని బలం వచ్చింది. వాణివిశ్వనాథ్ను రంగంలోకి దించడంతో.. ఇక రోజాకు చెక్ తప్పదనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రోజా సరికొత్త వ్యూహాలతో ముందుకువెళుతున్నారు. నగిరినే తన పుట్టినిల్లుగా భావించి.. అక్కడే సొంత ఇల్లు కట్టుకుంటున్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఇల్లు రెండు, మూడు నెల్లలో పూర్తయ్యే అవకాశముంది. టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడిని ఓడించి ఆమె జెయింట్ కిల్లర్ అయ్యారు. ఎమ్మెల్సీ అయ్యాక నగరి నియోజకవర్గాన్ని గాలి పూర్తిగా వదిలేశారు. ఈనేపథ్యంలో సీనియర్ నటి వాణి విశ్వనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రోజా నగరిపై మరింత పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకూ రోజా హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. నగరికి వచ్చినప్పుడు అద్దె ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండటం కంటే స్థానికురాలిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే సొంత ఇల్లును నిర్మించుకోవడమే మేలని భావించిన రోజా ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా తాజాగా సైలెంట్ అయ్యారు. నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత ఆమె మీడియా ముందుకు రావడమే మానేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రోజా కేవలం నగరికే పరిమితమవ్వాలని యోచిస్తున్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరిలోనే ఉంటూ అధికారులతో సమీక్షలు చేస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేసే పనిలో పడ్డారట. రోజా. మొత్తం మీద రోజా తన సొంత ఇంటిని చక్కదిద్దుకునే ప్రయత్నంలో పడ్డారు. మరి ఆమె ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచిచూద్దాం!