టీడీపీలోకి వాణీ విశ్వ‌నాథ్‌… ముహూర్తం ఫిక్స్‌

ఏపీలో రాజ‌కీయం ఎంత రంజుగా ఉందో చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ మ‌ధ్య వార్ అదిరిపోతోంది. తాజాగా జ‌రుగుతోన్న నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నిక‌ల‌కు ఓ టీజ‌ర్‌గా అంద‌రూ అభివ‌ర్ణిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎవ‌రికి వారు టీడీపీలోకో, వైసీపీలోకో త‌మ వీలును బ‌ట్టి జంప్ చేసేస్తున్నారు. ఇక పార్టీలు కొంత‌మందిని త‌మ అవ‌స‌రం కోసం ఆహ్వానిస్తున్నాయి.

ఈ క్ర‌మంలోనే నిన్నిటి త‌రం సీనియ‌ర్ హీరోయిన్ వాణీ విశ్వ‌నాథ్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది. తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో 1980-1990 ద‌శ‌కాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె తెలుగులో అగ్ర హీరోలంద‌రితోను న‌టించింది. సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో సైతం ఆమె సామ్రాట్ అశోక్ సినిమాలో న‌టించింది.

ఆదివారం చిత్తూరు జిల్లా న‌గ‌రికి చెందిన టీడీపీ సీనియర్‌ నేతలైన ఆనం శ్రీహరినాయుడు, దూర్వాసులు నాయుడు, హరినాయుడు, రామానుజం చలపతి తదితరులు వాణీతో చెన్నైలో స‌మావేశ‌మయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు ఆమెను టీడీపీలోకి ఆహ్వానించ‌గా ఆమె పార్టీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు.

త‌న‌కు ఇంత క్రేజ్ రావ‌డానికి కార‌ణ‌మైన తెలుగు ప్ర‌జ‌ల‌కు ఏదైనా చేయాల‌ని తాను అనుకుంటున్నాన‌ని, ఇక చంద్ర‌బాబు నాయ‌క‌త్వం గురించి ద‌క్షిణ భార‌త‌దేశం మొత్తం మాట్లాడుకుంటోంద‌ని, ఆయ‌న నాయ‌క‌త్వంలో ప‌ని చేసేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని ఆమె చెప్పారు. తాను త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి వెళ్లి టీడీపీలో చేర‌తాన‌ని ఆమె చెప్పారు.