ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుకోసం చావో రేవోలా పోరాడుతోన్న అధికార టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. గత వారం రోజుల్లో అక్కడ టీడీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముందుగా టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పార్టీ మారారు. ఇక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్గా ఉన్న రాకేశ్రెడ్డి కూడా వైసీపీలో చేరారు.
ఇక నిన్న టీడీపీకి చెందిన కౌన్సెలర్ కూడా వైసీపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా అక్కడ టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్ప చక్రపాణిరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి సోదరుడు అయిన చక్రపాణిరెడ్డికి టీడీపీలో గత కొద్ది రోజులుగా తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి.
ఆయన సోదరుడు పార్టీ మారినా చక్రపాణిరెడ్డి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. తాను పార్టీ మారనని చెపుతున్నా ఆయన్ను టీడీపీ వాళ్లు చాలా లైట్ తీస్కొంటున్నారు. ఆయన జిల్లా పార్టీ పగ్గాలను కూడా తప్పించారు. ఇటీవల సీఎం చంద్రబాబు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొనలేదు. ఇప్పటికే శిల్పా చక్రపాణి రెడ్డి, భూమా అఖిల ప్రియల మద్య అంతర్యుద్ధం జరుగుతోంది.
పార్టీలో అవమానాలు తట్టుకోలేకపోతోన్న ఆయన ఆగస్టు 3న జగన్ నంద్యాల పర్యటనలో ఆయన సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏదేమైనా ఇక్కడ వరుసగా పలువురు కీలక నేతలు వైసీపీలో చేరుతుండగా, ఇప్పుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఉప ఎన్నిక వేళ పార్టీ మారడం బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే షాకే అనుకోవాలి.