నంద్యాల ఓట‌ర్ల‌కు టీడీపీ బంప‌ర్ ఆఫ‌ర్‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్ప‌టినుంచే ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు నేత‌లు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా ప్రారంభం కాక‌ముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్ట‌ణ‌ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్ష‌న్ ఫ్రీ అంటూ ప్ర‌క‌టించ‌డం.. దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ కూడా బ‌దులివ్వ‌డం ఇప్పుడు అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. ఇంకా ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఈసీ నోటిఫికేష‌న్ ఇవ్వ‌క‌ముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. అస‌లైన యుద్ధం మొద‌లైన త‌ర్వాత‌.. ఇంకెన్ని ఉచిత హామీలు ఇస్తారో అని అంతా ఆశ్చ‌ర్యపోతున్నారు.

నంద్యాల‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వైసీపీ అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్‌రెడ్డి పేరు ఖ‌రారు కాగానే అధికార తెలుగుదేశం పార్టీ అల‌ర్ట్ అయిపోయింది. త‌మ పార్టీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డిని ఎన్నిక‌ల్లో గెలిపిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌చ్చే వ‌ర‌కూ కేబుల్ టీవీ క‌నెక్ష‌న్లు పూర్తి ఉచితంగా అందిస్తామ‌ని తెలుగుదేశం పార్టీ ఓట‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. నంద్యాల ప‌ట్ట‌ణ ఓట‌ర్లే ల‌క్ష్యంగా టీడీపీ మ‌రిన్ని హామీలు గుప్పించనుంద‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. ప‌ట్ట‌ణంలో నంద్యాల కేబుల్ నెట్‌వ‌ర్క్ అతిపెద్ద కేబుల్ క‌నెక్ష‌న్‌. ఇది భూమా నాగిరెడ్డి స‌న్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిది. దీనంత పెద్ద‌ది కాక‌పోయినా ఎస్పీవైరెడ్డికి కూడా నంది కేబుల్ నెట్‌వ‌ర్క్ ఉంది.

న‌గ‌రంలో ప్ర‌ధాన కేబుల్ నెట్‌వ‌ర్క్‌లు అధికార పార్టీ నేత‌ల‌వే కావ‌డంతో క‌నెక్ష‌న్లు ఫ్రీగా ఇస్తామ‌ని హామీ ఇస్తున్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లు కాబ‌ట్టి స‌హ‌జంగానే ఫ్రీ కేబుల్ క‌నెక్ష‌న్ వాగ్దానం ఫ‌లించి, ఓట్లు త‌మ‌కు ప‌డ‌తాయ‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నార‌ట‌. గ‌త ఎన్నిక‌ల్లో శిల్పా మోహ‌న్‌రెడ్డి టీడీపీ పార్టీ త‌రఫున పోటీ చేసిన‌ప్పుడు కూడా నెల‌కు రూ. 90 కే కేబుల్ క‌నెక్ష‌న్ అందిస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేబుల్ నెట్‌వ‌ర్క్ ఫ్రీ హామీ గుప్పిస్తుండ‌డంతో శిల్పా కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. చంద్ర‌బాబు ఉచిత హామీల‌న్నీ రైతు రుణ‌మాఫీలాగే ఉంటాయ‌ని, పూర్తి ఉచితంగా కాకుండా క‌నీసం రూ.50కి కేబుల్ క‌నెక్ష‌న్ ఇస్తామ‌నే వాగ్దానాన్ని వినిపిస్తున్నారు.