సమైక్యాంధ్ర ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విపక్షాల సంగతి ఎలా ఉన్నా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య కూల్వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోందన్నది వాస్తవం. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై మరొకరు ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎదరు పడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు.
ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ వెళ్లి మరీ చంద్రబాబును కలిసి చంద్రబాబు పాలన సూపర్ అని తెగ కితాబు ఇచ్చేశారు. ఆ మంత్రి తెలంగాణ ఆర్థికమంత్రి ఈటల రాజేందర్కావడం మరో విశేషం. తన కుమారుడు నితిన్ వివాహానికి చంద్రబాబును ఆహ్వానించేందుకు విజయవాడ వచ్చిన ఈటల విభజన తర్వాత ఏపీ ఆందోళన చెందిందని..కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవడంతో పాటు దేశంలోనే ముందంజలో ఉన్నాయని మెచ్చుకున్నారు.
ఇక ఏపీ చంద్రబాబు మార్క్ పాలనతో దూసుకుపోతోందని ఆయన బాబును ఆకాశానికి ఎత్తేశారు. ఏదేమైనా చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ మధ్య ఉప్పునిప్పుగా వ్యవహారం నడుస్తోన్న వేళ ఓ తెలంగాణ మంత్రి చంద్రబాబుపై ఇలా పొగడ్తల వర్షం కురిపించడం విశేషమే. మరి ఈటల చంద్రబాబుతో పాటు ఏపీ మంత్రులు, టీడీపీ నాయకులను తన కుమారుడు నితిన్ వివాహానికి ఆహ్వానించారు. వీరంతా ఈ కార్యక్రమానికి వస్తారు…వీరిని ఈటల తన మాటలతో ముందుగానే ప్రసన్నం చేసేసుకున్నారు కదా..!