పాలిటిక్స్ అన్నాక అధినేతని ఇంద్రుడు, చంద్రుడు అని పొగడడం కామనే! అయితే, ఇప్పుడు తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల సీఎం కేసీఆర్ను ఓ రేంజ్లో పొగిడేయడం ప్రారంభించాడు. ఇంద్రుడు, చంద్రుడు అనడం కాకుండా.. కేసీఆర్ను ఏకంగా గొల్ల, కురుమల కులాలు కుల దైవంగా భావించి బీరప్ప, మల్లన్నల ఇద్దరి స్వరూపమే కేసీఆర్ అంటూ.. తలసాని బాజా భజాయించాడట! ఇప్పుడు ఈ విషయంపైనే రాష్ట్రంలో చర్చించుకుంటున్నారు.
ఊరక పొగడరు మహాను భావులు అన్నట్టు.. కేసీఆర్పై తలసాని పొగడ్తల దండకం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయట. ఒకటి.. ఇటీవల కేసీఆర్ చేయించిన సొంత సర్వేలో మంత్రి తలసానికి మార్కులు తగ్గాయి. అంటే ఆయన గ్రాఫ్ ఆటోమేటిక్గా పడిపోతోందన్నమాట. నిజానికి టీడీపీ నుంచి జంప్ చేసి వచ్చినప్పటికీ.. యాదవ్ సామాజిక వర్గంలో ఎందరో నేతలు ఉన్నప్పటికీ.. కేసీఆర్.. తలసానిని ఏరి కోరి మంత్రిని చేశారు. కీలకమైన సినిమాటోగ్రఫీ శాఖను అప్పగించారు.
అయితే, మంత్రిగా తలసాని పనితనం అంతంత మాత్రమేనని సొంత కార్యక్రమాలతోనే పొద్దు పుచ్చుతున్నారని కేసీఆర్కి రిపోర్టులు అందాయి . దీంతో వాటి నుంచి తప్పించుకునేందుకు తలసాని ఓ రేంజ్లో కేసీఆర్పై అవకాశం వచ్చినప్పుడల్లా పొగడ్తల దండకం అందుకుంటున్నారు. ఇక, రెండో కారణం.. వచ్చే 2019 ఎన్నికల్లో తన కుమారుడిని పొలిటికల్ ఫీల్డ్లోకి దించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఒక ఇంట్లో రెండు సీట్లు రావాలన్నా కష్టమే. దీంతోనే ఇప్పటి నుంచే కేసీఆర్ను మచ్చిక చేసుకునేందుకు తలసాని తన ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే, అంతా తెలిసిన కేసీఆర్ ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి!!