బాల‌య్య‌ను వైసీపీ టార్గెట్ చేయ‌డం వెన‌క‌!

సినీన‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న హిందూపురంలో బ‌ల‌ప‌డేందుకు వైసీపీ తీవ్ర ప్ర‌యత్నాలు చేస్తోంది. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం, స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోవ‌డంతో నియోజ‌క‌వర్గ ప్ర‌జ‌లు కొంత అసంతృప్తిని వ్య‌క్తంచేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో బాల‌య్య‌ను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయ‌కులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. పెద్ద ఎత్తున ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేస్తూ.. బాల‌య్యను వీక్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతున్నారు.

ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత ఏర్పడింది. బాలకృష్ణ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హిందూపురంలో కూరగాయల మార్కెట్‌ను నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్ఆర్ సీపీ ధర్నాకు దిగగా, పోలీసులు అడ్డుకున్నారు. నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్‌ ఇంటివద్ద పోలీసులను భారీగా మోహరించారు. ధర్నాలో పాల్గొనేందుకు నవీన్‌ను ఇంటినుంచి బయటకు రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో నవీన్ ఇంటి వద్ద వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ధర్నాలో పాల్గొనకుండా నవీన్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. బాలకృష్ణ హామీలను విస్మరించడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇటీవల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగకుండా, పోలీసులు ముందస్తుగానే అడ్డుకుంటున్నారు.

ఈ నెల 7 నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బాలకృష్ణ స్థానికులకు అందుబాటులో ఉండటం లేదని, సమస్యలను పట్టించుకోవడంలేదనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి . ఈ ప‌రిణామాల‌న్నీ చూస్తుంటే.. బాల‌కృష్ణే ల‌క్ష్య‌మ‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది. మ‌రి బాల‌య్య వీటిపై ఎలా స్పందిస్తారో.. ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాల్సిందే!!