పార్టీలో ముందు నుంచీ ఉంచి ఉన్న తమను.. పక్కన పెడతామంటే సీనియర్లు ఊరుకుంటారా?! పార్టీ నిర్మాణానికి కృషి చేసిన తమను.. కరివేపాకులా తీసి పారేస్తుంటే సహించగలరా? అధినేతకు కష్టకాలంలో చేదోడు వాడుగా ఉన్న తమను..ఎవరి అదుపాజ్ఞల్లోనో నడవమంటే నడవగలరా? అసాధ్యమే కదా! ఇప్పుడు ఇదే పరిస్థితి వైసీపీలోని కొందరు సీనియర్ నాయకుల్లో కనిపిస్తోంది. ఇటీవల 2019 ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను అధినేత జగన్ తీసుకురావడం.. వైసీపీలో ముసలం రేపింది. అందుకే ఆయనకు పొగపట్టేందుకు ఇప్పటినుంచే సీనియర్ నాయకులంతా ప్రణాళికలు రచిస్తుండటం.. పార్టీలో చర్చనీయాంశమైంది.
వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను తీసుకురావడం పార్టీలో కొందరు సీనియర్లకి ఇష్టం లేదనే వార్తలు ఇప్పడు తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. అందుకే పైకి అధినేత జగన్ మాట విన్నట్టు నటిస్తూ ప్రశాంత్ కి పొమ్మనకుండా పొగబెడుతున్నారనే చర్చ వివాదాస్పదంగా మారుతోంది. వైసీపీ తరపున సోషల్ మీడియాలో లోకేష్ ని టార్గెట్ చేయడం.. `పొలిటికల్ పంచ్` రవికిరణ్ దొరికిపోడానికి, ముందస్తు ఎన్నికలు అని చంద్రబాబు సంకేతాలు ఇవ్వడం,ఆ వెంటనే జగన్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం వెంటవెంటనే జరిగిపోయిన పరిణామాలు.
ఇవి జరిగిన 48 గంటల లోపే జగన్ తో ప్రశాంత్ ఒప్పందం కుదిరినట్టు వార్తలు వచ్చాయి. అది తెలిసిన గంట వ్యవధిలోనే `పొలిటికల్ పంచ్` కేసులో ప్రశాంత్ కిషోర్ ని బాధ్యుడుగా చేస్తూ సోషల్ మీడియా కోడై కూసింది. అందులో వైసీపీ అనుకూల సోషల్ మీడియా కూడా ఉండటంతో లోగుట్టు ఏదో ఉందన్నవార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆయన పేరు రావడం వెనుక వైసీపీ నేతలు ఉన్నారని సమాచారం. ప్రశాంత్ కిషోర్ సీన్ లోకి రావడం ఇన్నాళ్లు జగన్ వెన్నంటి ఉన్న కొందరు నేతలకు ఇష్టం లేదట.
ప్రశాంత్ వస్తే ఇప్పటిదాకా వ్యూహరచనలో భాగమైనవాళ్లము ఇక చెప్పింది చేసే టీం లోకి వెళ్లాల్సి వస్తుందని సీనియర్లు బాధపడుతున్నారట. తమ ప్రాధాన్యం తగ్గడం ఇష్టం లేని ఆ నేతలు జగన్ మాటకి పైకి సై అంటూ లోన నై అంటున్నారు.అందుకే ఆయన్ని నిలువరించడానికి తమకి చేతనైన పద్ధతుల్లో ట్రై చేస్తున్నారట. అందులో భాగమే `పొలిటికల్ పంచ్` కేసుని ఆయన తో ముడిపెడుతూ వచ్చిన కథనాలు అంటున్నారు. యూపీలోనూ కాంగ్రెస్ నేతలు బజారున పడి ఆ అపజయాన్ని మాత్రం ప్రశాంత్కు ఆపాదించారు. మరి ఇప్పుడు కూడా వైసీపీలో ఇదే పరిస్థితి ఎదురవుతుందేమో!!