బీజేపీ నేతలకు స్వామిభక్తి రవ్వంత ఎక్కువే! సమయం ఏదయినా, సందర్భం ఏదయినా తమ స్వామి భక్తిని చాటుకుంటూ ఉంటారు కొందరు నేతలు! అయితే ఏపీలో సీఎం చంద్రబాబుపై బీజేపీ నాయకులు మండిపడుతుంటారు. కామినేని శ్రీనివాస్ వంటి వారు మాత్రం నిత్యం బాబు వెన్నంటే ఉంటూ.. ఆయనకు మద్దతుగా నిలుస్తుంటారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య-బాబు మధ్య స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కవే! వీలు దొరికినప్పుడల్లా బాబును ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు కూడా చేరిపోయారు. వెంకయ్యే అనుకుంటే.. ఆయన్ను మించిన రేంజ్లో బాబును స్తుతించేశారు.
శాసనసభలో విష్ణుకుమార్ రాజుకు కాసేపు మైక్ దొరికింది. అంతే… స్వామిభక్తి పరాణయత్వ ప్రదర్శనలో ఆసేతు హిమాలయాలను దాటేశారు! ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు కాకపోయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఏమై ఉండేదని ఆవేదన చెందారు విష్ణు కుమార్ రాజు! ఆయన్ని ఎన్నుకున్నందుకు ఆంధ్రా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే, రాష్ట్రం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తోందన్నారు! ఆ ఊహకి నిద్ర కూడా పట్టదు అని అన్నారు. ఈ పరిస్థితుల్లో భగవంతుడు పంపిన మహానుభావుడిలా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్షా అని చెప్పారు.
‘రాజ్యాధినేతలే చంద్రబాబు అభిమానులు కావడం గుర్తించాలి అధ్యక్షా. బిల్ క్లింటన్ వచ్చారు, బిల్ గేట్స్ వచ్చారు. అలాగే, సీఎంగారికి మరో మనవి అధ్యక్షా.. ఆయన రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారు. కనీసం ఆదివారమైనా ఆయన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాను అధ్యక్షా’ అని విష్ణుకుమార్ రాజు సభలో స్తుతించారు! మరీ ఈ రేంజిలో అంటే.. చంద్రబాబు కూడా తట్టుకోలేకపోయారు! విష్ణు రాజు మాట్లాడుతున్నంత సేపూ ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో తెలియక చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. ఎలా స్పందించాలో అర్థం కాక… కాసేపు నవ్వేసుకున్నారు కూడా!
దీంతో తెలుగుదేశం నాయకులు కూడా ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి. అరే.. తాము కూడా చంద్రబాబును ఈ రేంజిలో మోసెయ్యలేకపోయామే, ఒక భాజపా ఎమ్మెల్యే ఆ పనిచేసేశారే అని ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు. మరి ఇదంతా ఎందుకోసమో ఏమో!!