త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో ట్విస్ట్‌

మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నో మ‌లుపులు తిరిగిన త‌మిళ రాజ‌కీయాలు కుదుట‌ప‌డుతున్నాయి. ఎలాంటి థిల్ల‌ర్ సినిమాలోలోని ట్విస్ట్‌లు అక్క‌డ ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదేమో! ఇప్పుడిప్పుడే స‌ద్దుమ‌ణుగుతున్న త‌మిళ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం!! మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు కూతురినంటూ ఒక మ‌హిళ మీడియా ముందుకు రావ‌డంతో.. మ‌ళ్లీ త‌మిళ రాజ‌కీయాల్లో అల‌జ‌డి మొద‌లైంది. జ‌య‌ల‌లిత‌-ఎంజీఆర్‌ల బంధానికి ప్ర‌తీకగా వారికి కూతురు పుట్టింద‌ని, చిన్న‌త‌నంలోనే జ‌య నెచ్చెలి శశిక‌ళ వ‌ల్ల దూరమైపోయాన‌ని చెప్ప‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

త‌మిళ రాజ‌కీయాలు సినిమాను త‌ల‌పిస్తున్నాయి. అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన నాట‌కీయ ప‌రిణామాలు ఇప్ప‌టికీ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డం లేదు. సీఎం కుర్చీ కోసం జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ‌- అమ్మ న‌మ్మిన‌బంటు ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య జ‌రిగిన పోరు.. ఇంత‌తో శ‌శిక‌ళకు సుప్రీం షాక్ ఇవ్వ‌డం.. ప‌ళ‌నిస్వామిని సీఎం చేయ‌డం.. అప్ప‌టివ‌ర‌కూ త‌న‌దే అధికార‌మ‌ని న‌మ్మిన పన్నీరుకు అసెంబ్లీలో క‌న్నీరే మిగ‌ల‌డం.. ఇవ‌న్నీ ఒక సినిమాకు స‌రిపోయే అంశాలే!! అయితే ఇప్పుడు మ‌రో ట్విస్ట్‌!! అన్నాడీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీఆర్‌, జ‌య‌ల‌లిత త‌న అమ్మ‌నాన్న‌లు అని ప్రియా మ‌హాల‌క్ష్మి అనే మ‌హిళ‌.. చెప్ప‌డం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఎంజీఆర్- జయలలితకు ఓ కూతురు పుట్టిందట. ఆమెకు పేరు ప్రియా మహాలక్ష్మి. తాను చిన్నప్పుడే `అమ్మ` ప్రేమకు దూరమైపోయిందట. ఈ విషయం చిన్నమ్మకు కూడా తెలుసని, అయితే జయలలిత దగ్గరకు రాకుండా మహాలక్ష్మిని … శశికళే అడ్డుకుందని ప్రియా మహాలక్ష్మి చెబుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియా మహాలక్ష్మి వాదన ప్రకారం ఆమె ఇన్నాళ్లూ శశికళకు భయపడి అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయింద‌ట‌. శశి జైలుకు వెళ్లిపోవడంతో ఆమె తెగించి బయటకు వచ్చిందట.

ప్ర‌స్తుతం మహాలక్ష్మి ఓ కార్మికుల సంఘానికి కోశాధికారిగా ఉందని సమాచారం. ఇప్ప‌టికే త‌మిళ‌నాడులో ఏం జ‌రుగుతోందో ప్ర‌జ‌ల‌కు అర్థం కావడం లేదు. ఇప్పటికే శశిళక వర్గం, పన్నీర్ సెల్వం వర్గం, దీనికి తోడు దీప వర్గం.. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అమ్మ కూతురు వెలుగులోకి రావ‌డం మ‌రింత గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది.

అంతేకాదండోయ్ కొంద‌రు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఈ ప్రియతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నార‌ట‌.