ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ అధినేత బలంగా నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చేసుకున్నారు. దీంతో రాజకీయంగా బలపడ్డామని టీడీపీ నేతలు సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం ఎంతో కాలం నిలవడం లేదు! సంబరపడిన నేతలే అవాక్కవ్వబోతున్నారు! జగన్ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ నేతలంతా షాక్ ఇవ్వబోతున్నారు! పచ్చ కండువా కప్పుకున్న నేతలు.. ఇప్పుడు ఫ్యాన్ కిందకు చేరబోతున్నారు! దీంతో జగన్ ఇలాకాలో టీడీపీకి నగుబాటు తప్పేలా లేదు!!
కడపలో టీడీపీకి గట్టి షాక్ తగలబోతోంది. ఇటీవల వైసీపీ నుంచి కడప నగరపాలక సంస్థలోని కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. వైసీపీ నుంచి 12 కార్పొరేటర్లు విడతల వారీగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ల సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు. అయితే వారిలో ఇద్దరు ముగ్గురు కొన్ని రోజులకే సొంత గూటికి వెళ్లారు. ప్రస్తుతం మరో ఐదారుమంది ఆదే బాటలో పయనిస్తూ ఇడుపుల పాయలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చేరిన ఓ కీలక కార్పొరేటర్తో పాటు మరో ఐదు మంది సొంత గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకొని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం.
వారు టీడీపీలో చేరినా.. అందులో ఇమడలేకపోతున్నారని సమాచారం! దీంతో వారు తిరిగి ఇప్పుడు సైకిల్ దిగి సొంత గూటికి చేరిపోవాలని నిర్ణయించుకున్నారట. గురువారం జగన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో వారు తిరిగి వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. జగన్ నియోజకవర్గమైన పులివెందులకు నీటిని పంపి బలపడాలని నిర్ణయించుకున్న టీడీపీకి ఇది కొంత ఇబ్బందికర పరిణామమే!!