నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెరంగ్రేటానికి రంగం సిద్ధమవుతోంది. మోక్షజ్ఞ నటించే తొలి సినిమాను బాలయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడు. నిన్నటి వరకు మోక్షు డెబ్యూ మూవీకి పలువురు దర్శకుల పేర్లు వినిపించినా ఇప్పుడు మరో డైరెక్టర్ పేరు తెరమీదకు వచ్చింది.
తాజాగా బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాలయ్యకు కేరీర్లో మర్చిపోలేని మెమరబుల్ హిట్ ఇచ్చిన క్రిష్తోనే తన కుమారుడిని వెండితెరంగ్రేటం చేయించాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా కథగా తాను నటించిన శాతకర్ణి సినిమా కంటిన్యూ కథనే ఎంచుకోవాలని కూడా బాలయ్య భావిస్తున్నాడట.
బాలయ్య శాతకర్ణిగా రౌద్రరసంతో రెచ్చిపోయాడు. ఇప్పుడు మోక్షు సినిమాకు శాతకర్ణి కుమారుడు వశిష్టీ పుత్ర పులోమావి కథ అయితే కరెక్టుగా సూట్ అవుతుందని బాలయ్య భావిస్తున్నాడట. అయితే శాతకర్ణిలో పులోమావి సినిమాను యుద్ధ కోణంలో కాకుండా ప్రేమకోణంలో తీస్తారని తెలుస్తోంది.
పులోమావి రాజు శ్రావణి అనే రాకుమారి ప్రేమలో పడతాడట. ఇందుకోసం ప్రముఖ రచయిత ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘శ్రావణి’ నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తారని ఫిల్మ్నగర్ వర్గాల టాక్. ఈ నవలతో పాటు కొన్ని చారిత్రక ఆధారాల ఆధారంగా మోక్షు డెబ్యూ మూవీ ఉంటుందని సమాచారం.