ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ కేబినెట్లోకి ఎంట్రీ ఇస్తారని గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఎలా తాజాగా ఓ విషయంలో చంద్రబాబు లోకేష్పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారని దేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రారంభించారు.
ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఒక్క నెలలోనే దాదాపు 25 లక్షల మందిని సభ్యులుగా చేరారు. చినబాబు ప్రాపకం పొందేందుకు కొందరు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, సీనియర్లు సైతం ఈ క్రెడిట్ అంతా లోకేష్దే అని డప్పు కొట్టేశారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. పార్టీ నేతల సమావేశంలోనే చంద్రబాబు లోకేష్పై ఫైర్ అయ్యారట.
గతేడాది 50 లక్షల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకుంటే ఈ యేడాది కేవలం 37 లక్షల సభ్యత్వాలు మాత్రమే నమోదయ్యాయని చంద్రబాబు తన అసంతృప్తి వ్యక్తం చేశారట. ప్రభుత్వానికి అంతా సానుకూల వాతావరణం ఉన్నా గతేడాదితో పోలిస్తే ఏకంగా 18 లక్షల సభ్యత్వాలు తగ్గిపోవడం ఏంటని ప్రశ్నించిన ఆయన మంత్రులు, నాయకులు పనితీరు మార్చుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి వక్కాణించారట.
ఇక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగించాలని కూడా సూచించారట. ఇక తెలంగాణలో సభ్యత్వ నమోదు గురించి ఎంత తక్కువుగా మాట్లాడుకుంటే అంత మంచిది. వాస్తవానికి గతంతో పోల్చుకుంటే చాలా ఎక్కువుగా 70 లక్షల సభ్యత్వాలను ఈ సారి టీడీపీ టార్గెట్గా చేసుకుంది. అయితే అందులో సగం మాత్రమే అవ్వడంతో చంద్రబాబు లోకేష్పై అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.