ఏపీ పాలిటిక్స్లో అధికార టీడీపీ – విపక్ష వైకాపా మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు హీటెక్కుతోంది. అధికార టీడీపీ – విపక్ష వైకాపా నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరుగుతోంది. ఈ క్రమంలో వైకాపా అధినేత జగన్ తనపై ఒంటికాలితే లేచి విరుచుకు పడే మంత్రులతోనే మంతనాలు జరిపి…ముచ్చట్లు పెట్టారట. జగన్ తనను విమర్శించే మంత్రులతో మంతనాలు జరపడం ఏంటి ? ఆ కథేంటో చూద్దాం.
తన పార్టీ నేతలకే మాట్లాడేందుకు సరైన టైం ఇవ్వని జగన్ అసెంబ్లీ సాక్షిగా తనపై ఓ రేంజ్లో ఫైరైపోయే మంత్రులు అచ్చెన్నాయుడు సహా పత్తిపాటి పుల్లారావు, కేఈ కృష్ణమూర్తి వీరందరిని నవ్వుతూ పలకరిస్తున్నారట. వీరు ఎదురైతే చాలు నవ్వుతూ పలకరిస్తున్నారట. వీరు తనకు ఎదురైతే చాలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేస్తున్నారట.
జగన్లో వచ్చిన ఈ సెడన్ మార్పు చూసి వైకాపా నేతలే షాక్ అవుతున్నారట. జగన్ ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ ఆయనకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు జగన్కు తారసపడ్డారట. అంతే జగన్ నవ్వుతూ వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. తర్వాత విమాన ప్రయాణం జరిగినంత సేపు జగన్ వారితో జోకులు వేస్తూ కాలక్షేపం చేశారట. అసెంబ్లీ జరిగినన్ని రోజులు కత్తులు దూసుకునే వీరంతా విమాన ప్రయాణంలో ఇక ఇకలు పకపకలతో ఉండడంతో వారితో పాటు జర్నీ చేస్తున్న వారంతా షాక్ అయ్యారట.
ఇక ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో సైతం జగన్ టీ టీడీపీ నేత రేవంత్రెడ్డి ఎదురవ్వడంతో జగనే స్వయంగా రేవంత్ వద్దకు వెళ్లి రేవంత్ అన్నా ఎలా ఉన్నావ్ అని కుశలు ప్రశ్నలు వేసి రేవంత్ చేతిలో చేయి వేసి మాట్లాడారట. వాహనం వచ్చిందా అని కూడా జగన్ అడగగా రేవంత్ మావాళ్లు వచ్చారులే అని ఆన్సర్ ఇచ్చి అక్కడ నుంచి ముందుకు కదిలారట.
అదే టైంలో విమానాశ్రయానికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు రేవంత్కు అనుకూలంగా జై రేవంత్ అన్నా..జైజై రేవంత్ అన్నా నినాదాలు గట్టిగా చేయడంతో జగన్ నవ్వుతూ అక్కడ నుంచి నిష్క్రమించారట. ఇక జగన్ ఇటీవల తన సొంత పార్టీ నేతలు వైకాపా నాయకులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా గతంలో కంటే చాలా క్లోజ్గా, కుశల ప్రశ్నలతో వారితో మాట్లాడుతున్నారట. జగన్లో ఈ సడెన్ మార్పు మ్యాటర్ వైకాపా, టీడీపీ నేతలతో పాటు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు వచ్చింది.
అసలు మ్యాటర్ ఏంటంటే జగన్ ఇటీవల 2019లో గెలిచేందుకు సలహాలు, సర్వేల కోసం ఓ ఏజెన్సీని నియమించుకున్నారట. వారి సలహాలతో పాటు దూకుడు తగ్గించాలని పార్టీలోని సీనియర్లు ఇచ్చిన సలహాలతోనే జగన్లో ఈ సడెన్ ఛేంజ్ వచ్చినట్టు తెలుస్తోంది.