కాంగ్రెస్ జేఏసీ క‌న్వీన‌ర్‌గా కోదండ‌రాం..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ ఎస్ నేత‌లు.. ఉద్య‌మ నేత టీ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్ర‌భుత్వ విధానాల‌ను కోదండ రాం గ‌త కొన్నాళ్లుగా త‌ప్పుప‌డుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, ప్ర‌గ‌తి భ‌వ‌న్ పేరిట సీఎం సొంత నివాసం ఏర్పాటు చేసుకోవ‌డం, మ‌ల్లన్న సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలోనూ ప్ర‌భుత్వం దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డంపై కోదండ రాం గ‌త కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్‌ను నేరుగానే విమ‌ర్శిస్తున్నారు. దీంతో అలెర్ట‌యిన ప్ర‌భుత్వ ప‌క్షం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కోదండ‌రాంకు ఇచ్చిన గౌర‌వాన్ని ప‌క్క‌న‌పెట్టేసింది.

ఈ క్ర‌మంలో మొట్ట‌మొద‌ట మీడియా మీటింగ్‌లో మాట్లాడిన మంత్రి కేటీఆర్ చిప్ప‌కూడు తిన్న‌వాళ్ల‌తో స్టేజ్ పంచుకోవ‌డానికి సిగ్గుండాల‌ని తీవ్ర‌స్థాయిలో కోదండ‌రాంపై ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో క‌లిసి స్టేజ్‌పై మాట్లాడ‌డాన్ని కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. ఇక‌, అప్ప‌టి నుంచి టీఆర్ ఎస్ నేత‌లు కోదండ‌రాంపై విరుచుకుప‌డుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ఎంపీ బాల్క సుమ‌న్ కోదండ రాంని విమ‌ర్శించే డ్యూటీ స్వీక‌రించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇటీవ‌ల కాలంలో బాల్క నిర్వ‌హిస్తున్న అన్ని మీటింగ్‌ల‌లో కూడా కోదండ‌రాంనే టార్గెట్ చేస్తున్నారు.

తాజాగా.. కోదండ‌రాంపై విరుచుకుప‌డ్డ బాల్క సుమ‌న్‌.. కోదండ రాం టీజేఏసీకి ఏనాడూ క‌న్వీన‌ర్ కాద‌ని, కేవ‌లం టీఆర్ ఎస్ ఏర్పాటు చేసిన స‌భ‌ల్లో వ‌చ్చి మాట్లాడిపోవ‌డం త‌ప్ప ఆయ‌న‌కు ఏమీ తెలీద‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా విప‌క్ష పార్టీ కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి.. టీఆర్ ఎస్‌పై కోదండ‌రాం విమ‌ర్శ‌లు చేస్తున్నాడ‌ని, ఆయ‌న కాంగ్రెస్ జేఏసీకి క‌న్వీన‌ర్ అయిన‌ట్టు ఉన్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న కాంగ్రెస్‌కు కార్య‌క‌ర్త‌గా మారాడ‌ని అన్నారు. మొత్తానికి బాల్క వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. టీజేఏసీని ఆయ‌న కేజేఏసీగా పేరు పెట్ట‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి రాబోయే రోజుల్లో మ‌రెన్ని విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు చోటు చేసుకుంటాయో చూడాలి .