ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు ఎవ‌రు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడి నియామ‌కంలో క‌మ‌లం పార్టీ అధిష్టానం ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది! రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత అత్యంత కీల‌క రాష్ట్రంగా ఏపీని భావించిన క‌మ‌ల నాథులు ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుతో జ‌త‌క‌ట్టారు. ఎన్నిక‌ల్లో నెగ్గి అధికారం కూడా పంచుకున్నారు. ఇక‌, ఇప్పుడు 2019 నాటికి సొంత కాళ్ల‌పై ఎద‌గ‌డం, పార్టీని బ‌లోపేతం చేయ‌డం అనే రెండు ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌ను నిర్దేశించుకున్నారు. దీనికిగానే కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభించాల్సిన స‌మ‌యం మించిపోతున్నా.. బీజేపీ అధిష్టానం పెద్ద గా స్పందిస్తున్న దాఖ‌లాలు లేవు.

ఏ జాతీయ‌ పార్టీకి అయినా.. స్థానికంగా రాష్ట్రాల్లో ఎద‌గాలంటే.. అధ్య‌క్ష ప‌ద‌వి కీల‌కం. పార్టీ శ్రేణుల‌ను ముందుండి న‌డ‌ప‌డ‌మే కాకుండా.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌గ‌లిగేది.. అధ్య‌క్షుడే! పార్టీ వాణిని ప్ర‌జ‌ల‌కు వినిపించేదీ అధ్య‌క్షుడే. అలాంటి అధ్య‌క్ష స్థానం ఏపీలో బీజేపీకి మ‌రింత కీలకం. ఎవ‌రు నిష్టూరాలు పోయినా.. ఏపీలో కుల ప్రాతిప‌ద‌క‌న పాలిటిక్స్ తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ మ‌రింత‌గా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ఈ నేప‌థ్యంలోనే అధ్య‌క్ష పీఠానికి ఎన్నుకునే వ్య‌క్తి విష‌యంలో ఆచి తూచి వ్య‌వ‌హ‌రించాలి. ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబు ప‌ద‌వీ కాలం తీరి ఏడాది అయింది. ఈ ప‌ద‌వి కోసం కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజు ఎదురు చూస్తున్నారు. త‌న‌వంతుగా అధిష్టానం వ‌ద్ద చ‌క్రం కూడా తిప్పారు. అయితే, టీడీపీతో పొత్తు ఉన్న విష‌యాన్ని మ‌రిచిపోయిన ఆయ‌న సీఎం చంద్ర‌బాబు టార్గెట్‌గా అనే క వ్యాఖ్య‌లు చేశారు. దీంతో మంత్రి కామినేని వ‌ర్గం సోముకు వ్య‌తిరేకంగా మారింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌కుండా కేంద్ర మంత్రి వెంక‌య్య ద‌గ్గ‌ర పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసిన‌ట్టు స‌మాచారం. దీంతో సోముకు వ‌స్తుంద‌నుకున్న ప‌ద‌విపై ఇంకా స్ప‌ష్టత లేదు

దీంతో ఏపీ బీజేపీకి అధ్య‌క్ష పీఠం ఎన్నిక క‌స‌ర‌త్తు కొలిక్కి రాలేదు. హ‌రిబాబును కొన‌సాగిస్తార‌ని కొంద‌రు అంటుంటే.. సోము కు ఇవ్వాల‌ని ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. అయితే, ఈ రెండు కాకుండా ఇంకెవ‌రైనా ఉంటే బాగుంటుంద‌ని అధిష్టానం యోచిస్తున్న‌ట్టు మ‌రో వార్త‌! ఈ నేప‌థ్యంలో మంత్రి మాణిక్యాల రావు పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. కంభంపాటి టైం ముగిసింది కాబ‌ట్టి.. ఆయ‌న ప్లేస్‌లో సోము బ‌దులు మాణిక్యాల‌రావును నియ‌మిస్తే.. అటు టీడీపీతోను ఇటు బీజేపీతోనూ ఆయ‌న క‌లుపుకొని పోతార‌ని భావిస్తున్నార‌ట‌. మొత్తానికి ఇప్ప‌టికైతే ఏపీ బీజేపీ అధ్య‌క్ష‌డి నియామ‌కం ఎటూ తేల‌లేదు. ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి .