ప‌వ‌న్‌ను ఫాలో అవుతున్న ఎన్టీఆర్‌

జనతా గ్యారేజ్ విజయం తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాపై ఇండ‌స్ట్రీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూనియర్ కోసం ఎంతోమంది దర్శకులు ఎదురు చూస్తున్నా ఎన్టీఆర్ మాత్రం వాళ్లు చెప్పే క‌థ‌లు కూడా వినేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా కోసం దాదాపు ఆరేడుగురు ద‌ర్శ‌కుల పేర్లు వినిపించాయి. మూడు వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో ఉండ‌డంతో ఎన్టీఆర్ కూడా ఎవ‌రితో ప‌డితే వారితో చేసేందుకు సిద్ధంగా లేడు.

రాజమౌళి, త్రివిక్రమ్ వంటి దర్శకులపై కన్నేసిన ఎన్టీఆర్ వాళ్ల నుంచి డేట్లు తీసుకోలేకపోయారు. రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్ వారి ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. కొద్ది రోజులుగా పెద్ద మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారిపోయిన ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ సినిమా విష‌యంలో ఒక క్లారిటీకి వచ్చినట్లు టాలీవుడ్ ఇన్న‌ర్ సైడ్ టాక్‌. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను ఫాలో అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌.

పవర్ స్టార్ ప్రస్తుతం తమిళ హీరో అజిత్ హిట్ చిత్రం ‘వీరమ్’ రీమేక్‌ ‘కాటమరాయుడు’లో నటిస్తున్నాడు. అంతేకాక, అజిత్ వేదాలం సినిమాను కూడా రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాట‌మ‌రాయుడుకు డాలీ, వేదాళం రీమేక్‌కు నీస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పవన్‌లాగే ఎన్టీఆర్ కూడా అజిత్ హిట్ చిత్రాలను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట.

 ఎన్టీఆర్ త‌న త‌ర్వాత చిత్రాన్ని తమిళ టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో మరో హీరోతో కలిసి చేయాలని భావిస్తున్నాడట. ఎన్టీఆర్ ఇప్ప‌టికే ఆ త‌మిళ డైరెక్ట‌ర్‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీపై క్లారిటీ రానుంది.