అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవకాశం వచ్చినా తమ పవర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక, వారి ఇళ్లల్లో ఏదైనా వేడుకలు జరిగితే.. ఆ టైంలో చూపించే పవరే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ తన పవర్ ఏంటో చూపించారనే టాక్ వినిపిస్తోంది. ఆ పవర్ ఏ రేంజ్లో ఉందంటే.. కనీసం పిట్టకు కూడా చిక్కని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ కట్టుకుని మరీ తలసాని ఇంట జరిగిన ఫంక్షన్కి హాజరయ్యారు. ముఖ్యంగా మహేష్ బాబు వంటి బిజీ హీరో సైతం అటెండ్ అయ్యాడంటే.. తలసాని పవర్ రేంజ్ని అంచనా వేయొచ్చు!!
కొన్ని రోజుల కిందట మంత్రి తలసాని తన కుమార్తె స్వాతి వివాహం అంగరంగ వైభవంగా జరిపించారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఇచ్చేశారు. అయినప్పటికీ.. మూవీ ఇండస్ట్రీ కోసం సోమవారం ప్రత్యేకంగా హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో భారీ రేంజ్లో రిసెప్షన్ ఇచ్చారు. దీనికి టాలీవుడ్ మొత్తం అటెండైపోవడమే ఇక్కడ బిగ్ డిబేట్! వాస్తవానికి ఎక్కడ ఎలాంటి ఫంక్షన్ జరిగినా.. ఇంత రేంజ్లో టాలీవుడ్ అటెండ్ కావడం అరుదనే చెప్పొచ్చు. కానీ, తలసాని ఇచ్చిన విందుకు మాత్రం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారు.
ఇలా.. ఒక్కసారే ఇండస్ట్రీ మొత్తం వాలిపోవడంపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు కురుస్తున్నాయి. ప్రధాని మోడీ దెబ్బకి నల్ల ధనం కట్టలు బయట పడుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్లోనూ నల్ల కుబేరులకు కొదవలేదు. ఈ క్రమంలో ఇప్పుడు వాళ్లకి పవర్లో ఉన్న వాళ్ల సహకారం అత్యవసరం.
అదేసమయంలో తమకు సహకరించే పవర్ ఫుల్ వ్యక్తులు కూడా అవసరం. అందుకే వాళ్లు తలసాని ఇంట విందుకు క్యూ కట్టుకుని మరీ హాజరయ్యారనే టాక్ వస్తోంది. తెర వెనుక విషయాల్లో తలసాని తనకు తానే సాటి అని చెబుతుంటారు చాలా మంది. ఈ క్రమంలో ఇప్పుడాయన అవసరం టాలీవుడ్కు ఎంతో ఉందని, అందుకే.. మెగా బ్రదర్ నాగబాబు సహా హేమా హేమీలు క్యూకట్టారని అంటున్నారు. మరి తలసాని పవర్ అంటే అదీ!!