ఏపీలో ఇప్పుడు సర్వే సమయం కొనసాగుతోంది! అధికార టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తన పాలన, టీడీపీ పరిస్థితిపై సర్వే చేయించినట్టు తెలుస్తోంది. వచ్చే 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం ఎవరి వశం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీలో ఎన్నికలు వస్తే.. తమ పార్టీ పరిస్థితి ఏమిటి? ఎన్ని సీట్లు వస్తాయి? ఎంత మేరకు తమ ఆశలు సాకారం అవుతాయి? వంటి అంశాలపై చంద్రబాబు ఇంటర్నల్ సర్వే చేయించారు. ఈ సర్వేలో చంద్రబాబుకి దిమ్మతిరిగే.. రిజల్ట్ వచ్చిందని తెలుస్తోంది. వాస్తవానికి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 102 సీట్లు సాధించింది.
దీంతో ఎవరి సహకారం లేకుండానే అధికారంలోకి వచ్చింది. అయినా కూడా బీజేపీతో చెలిమి చేస్తూ.. పాలనను సాగిస్తోంది. అయితే, ఇటీవల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న అవినీతి, రైతుల్లో వ్యతిరేకత, కాపు ఉద్యమం వంటి వాటి నేపథ్యంలో టీడీపీ ఇమేజ్ దెబ్బతిందని సమాచారం. అంతేకాకుండా ఏపీకి ప్రత్యేక హోదా తేవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారనే ఆలోచన కూడా ఇప్పుడు ఏపీ ప్రజల్లో భారీ ఎత్తున ఉండడం గమనార్హం. ఇవన్నింటి నేపథ్యంలో బాబు తాజాగా ఓ సర్వే చేయించారు.
ఈ సర్వేలో టీడీపీకి కేవలం 60 అసెంబ్లీ సీట్లు, 8-10 ఎంపీ స్థానాలు దక్కే ఛాన్స్ ఉందిన తెలుస్తోంది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు.. పార్టీని మరింత వేగంగా నడిపించాలని డిసైడ్ అయ్యారు. ఇక, టీడీపీ చెలిమి పార్టీ బీజేపీ కూడా ఓ సర్వే చేయించింది. దీనిలోనూ టీడీపీ, బీజేపీలకు అత్తుసరు మార్కులే వచ్చాయని సమాచారం. దీనికి ప్రధాన కారణం.. ఏపీకి హోదా ఇస్తామని ఇవ్వకపోవడమేనని తేలింది. దీనిని విపక్షం వైకాపా, కాంగ్రెస్లు తమకు అనుకూలంగా మలుచుకున్నారని కూడా సమాచారం.
పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చేతులారా.. 2019లో అధికారాన్ని వదులుకోవాల్సి వస్తుందని టీడీపీ సారధి తెగ ఇదైపోతున్నట్టు తెలుస్తోంది. దాంతో, పార్టీ ముఖ్య నేతలందరినీ పిలిచి మరీ క్లాస్ పీకిన చంద్రబాబు, ఇప్పటికిప్పుడు పుంజుకోకపోతే కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి, చంద్రబాబు చేయించిన అంతర్గత సర్వేల ఫలితాలు అలా వుంటే, టీడీపీ అనుకూల మీడియా కథనాలు ఏకంగా, చంద్రబాబు ఇమేజ్ పెరిగిపోయినట్లు, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఫలితాలు ఏకపక్షంగా, చంద్రబాబుకి అనుకూలంగా వస్తాయని చెబుతుండడం గమనార్హం. సో.. సర్వేలు ఏం చెప్పినా.. అంతిమంగా ప్రజాతీర్పే ప్రధానం!