ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ.. దినపత్రికలకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అసలు ఓ పేదేళ్ల కిందట ఎలక్ట్రానిక్ మీడియా అడుగులు వేస్తున్న క్రమంలో ఇంక దినపత్రిక పని అయిపోయింది! అనే టాక్ వచ్చింది. అయితే, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా బలంగా దినపత్రికలే నేటికీ తమ ఉనికిని చాటుతున్నాయి. మీడియాపై ఒకింత తేలిగ్గా విమర్శలు చేసే వాళ్లు కూడా పత్రికల విషయానికి వచ్చేసరికి ఆచితూచి మాట్లాడతారు. ప్రజలు కూడా ఎక్కువగా పేపర్లనే నమ్ముతారు. అందుకే ఎలక్ట్రానిక్ మాధ్యమం కన్నా ప్రింట్ మాధ్యమానిదే ఎవర్ గ్రీన్ లైఫ్! ఇక, పొలిటికల్ విషయానికి వచ్చేసరికి ఎవరినైనా ఆకాశానికి ఎత్తేయాలన్నా.. గిట్టనివాళ్లని పాతాళానికి తొక్కేయాలన్నా కూడా పత్రికలదే ప్రధాన రోల్. అలాంటి రోల్ ఏపీలోని పలు పత్రికలు చేస్తూనే ఉన్నాయి.
ప్రస్తుత అధికార టీడీపీకి పరోక్షంగా మద్దతిచ్చే పత్రికలు.. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు తమవంతు అక్షరాలను చిందించాయి! అయితే, ఇటీవల కాలంలో విపక్ష నేత వైకాపా జగన్కు ఉన్న మీడియా.. లాంటిదే తమకు కూడా ఓన్గా ఉంటే బాగుంటుందని భావించిన సీఎం చంద్రబాబు.. దీని బాధ్యతలను ఆయన తనయుడు లోకేష్కు అప్పగించారంట. ప్రస్తుతం ఈ చర్చలు నడుస్తుండగానే.. ఏపీ మంత్రులు, వియ్యంకులు గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలు స్వయంగా ఓ పత్రికను అచ్చొత్తాలని డిసైడ్ అయ్యారనేది తాజా టాక్. 2019 ఎన్నికల నేపథ్యంలో తమకంటూ సొంతంగా ఓ పేపర్ ఉంటే ప్రచారానికి వీలుంటుందని వారిద్దరూ మంచి ప్లాన్లో ఉన్నారట.
మరోపక్క, ఇదే పత్రిక ద్వారా టీడీపీకి కూడా ఫేవర్ చేయొచ్చని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. వాస్తవానికి గతంలో మంత్రి గంటా విశాఖలో స్థానిక పత్రికను ఒక దానిని బినామీ పేరుతో నిర్వహించారు. దీని ద్వారా ఆయన పాజిటివ్ స్టోరీలు నడిపించి తాను ఎన్నికల్లో గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనేది టాక్. ఇప్పుడు కూడా అదే ఫార్ములా స్టేట్ అంతా విస్తరించేలా చేయాలని ఈ వియ్యంకులు ప్లాన్ చేస్తున్నారంట. ఇదే వర్కవుట్ అయితే, బాబు కోసం మరో పత్రిక రెడీ అయినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు ప్రధాన పేపర్లు.. టీడీపీ పల్లకీని మోస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో తాజా పత్రిక పరిస్థితి ఎలా ఉండబోతోందనేది కొన్ని రోజులు ఆగితే గానీ చెప్పలేం.