వెంక‌య్య బాగా హ‌ర్ట్ అయ్యారట‌

ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా ప్ర‌త్యేక ప్యాకేజీతో స‌రిపెట్టిన కేంద్రంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాకినాడ స‌భ‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన విష‌యం అంద‌రిక‌న్నా బాగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌కు గుర్తిండిపోయింది! ఆయ‌న ప‌డుకున్నా లేచినా ప‌వ‌న్ వ్యాఖ్య‌లే గుర్తుకొస్తున్న‌ట్టున్నాయి. దీంతో ఈ విష‌యం జ‌రిగి దాదాపు నెల గ‌డుస్తున్నా.. ప‌వ‌న్‌పై వెంక‌య్య ఇంకా స‌టైర్లు కుమ్మేస్తూనే ఉన్నారు. ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోల్చిన ప‌వ‌న్‌.. ఆ స‌మ‌యంలో కేంద్రం స‌హా బీజేపీపై తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయారు. ఇక వెంక‌య్య‌పైనైతే.. గ‌తంలో ఎవ్వ‌రూ విమ‌ర్శించ‌ని రీతిలో కామెంట్ల వ‌ర్షం కురిపించేశారు. అయితే, అప్ప‌ట్లోనే వీటికి వెంక‌య్య కౌంట‌ర్ ఇచ్చారు. తాను ఎవ‌రికీ స‌మాధానం చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు.

ఇప్పుడు మాట్లాడుతున్న‌వారంతా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. అంత‌టితో అయిపోయింద‌నుకున్న వెంక‌య్య కౌంట‌ర్లు ఇంకా కొన‌సాగుతుండడ‌మే ట్విస్ట్‌! వాస్త‌వానికి అంత్య ప్రాస‌ల‌తో త‌న ప్ర‌సంగాన్ని ఇర‌గ‌దీసే వెంక‌య్య మంగ‌ళ‌వారం తెనాలి వేదిక‌గా మ‌రోసారి రెచ్చిపోయారు. తెనాలిలో ఆయ‌న‌కు మంగ‌ళ‌వారం ఘ‌న‌ స‌న్మానం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌ మాట్లాడుతూ.. ప్య‌త్యేక ప్యాకేజీపై త‌న వివ‌ర‌ణ రీల్‌ను మ‌రోసారి రివైండ్ చేశారు. హోదా క‌న్నా ఎక్క‌వగానే ప్యాకేజీ పేరుతో ఇస్తున్నామ‌న్నారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ పేరు ఎత్త‌కుండానే కొంద‌రు ప్యాకేజీని పాచిపోయిన ల‌డ్డూల‌తో పోలుస్తున్నార‌ని, అయితే డ‌బ్బులు పాచిపోవ‌ని కౌంట‌ర్ రువ్వారు.

 రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో రాష్ట్రానికి జరుగుతున్న నష్టం పట్ల ఆనాడు రాజ్యసభలో చూస్తూ ఊరుకోలేకపోయానని చెబుతూ.. ఆనాడు పార్ల‌మెంటులో జ‌రిగిన విష‌యాల‌ను పూర్తిగా వివ‌రించారు. ఈ సంద‌ర్భంగానే ల‌డ్డూలు పాచి పోవ‌చ్చు.. కానీ, డ‌బ్బులు పాచి పోవు. అంటూ ప‌వ‌న్‌పై రివ‌ర్స్ కామెంట్‌ రువ్వారు. ఇక‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌ను ఉద్దేశించి..  హోదా అనే ఒక పదాన్ని ప‌ట్టుకొని మాకు అదే కావాల‌ని మాట్లాడుతున్నారు. హోదాకు త‌గిన విధంగానే ప్రత్యేక సాయం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేసినా అవే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అంటే.. వెంక‌య్య రివ‌ర్స్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏదేమైనా.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లతో వెంక‌య్య బాగా హ‌ర్ట్ అయ్యార‌ని అంటున్నారు పొలిటిక‌ల్ పండితులు.