‘జులాయి’ దోపిడీ:90 సెకన్లలో 15 లక్షలు

బ్యాంకు దోపిడీ.. నిమిషన్నరలోనే పూర్తి చేసేశారు. ఇలా వచ్చారు అలా వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే పనంతా అయిపోయింది. మొత్తం 15 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘరానా దోపిడీ పంజాబ్ లోని లుథియానాలో ఉన్న జవహర్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో జరిగింది. సోమవారం జరిగింది ఈ దోపిడీ. మరో విశేషం ఏంటంటే కోచర్ మార్కెట్  పోలీస్ పోస్ట్ కు సరిగ్గా 200 మీటర్ల దూరంలో ఉంది ఈ బ్యాంక్.

మొత్తం నలుగురు దుండగులు. వారిలో ఒకరికి సిక్కుల ధరించే పాగా ఉంది. బ్యాంకులోకి వచ్చేటప్పటికి లోపల మొత్తం ఆరుగురు ఉన్నారు. ఒకరు కస్టమర్.. మిగిలినవాళ్లు బ్యాంకు సిబ్బంది. సరిగ్గా సమయం సాయంత్రం 3.45గంటలు. నలుగురిలో ఒకడు ఫైర్ చేశాడు. ఇద్దరు క్యాషియర్ దగ్గర ఉన్నారు. మరొకడు మేనేజర్ దగ్గరకు కత్తి పెట్టి బెదిరిస్తున్నాడు.

కష్టమర్ అప్పుడే డిపాజిట్ చేసిన 15 లక్షలను అందుకుని.. క్షణం ఆలస్యం చేయకుండా బయటపడ్డారు అందరూ. షాక్ నుంచి తేరుకొనేలోగానే అంతా అయిపోయింది. పంజాబ్ పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టారు. దుండగుల వేట మొదలు పెట్టిన పోలీసులు.. ఇది తెలిసినవారి పనిగా అనుమానిస్తున్నారు.