పదవి పోయినా డోన్ట్‌ కేర్‌: కేశినేని

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం తమ పదవులు పోయినా లెక్కచేయబోమని టిడిపి ఎంపీలు అంటున్నారు. బిజెపితో అమీ తుమీకి సిద్ధమని చెబుతూ అధినేత చంద్రబాబు సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని నాని చెప్పారు. అలాగే, పదవుల కోసం పాకులాడేవాళ్ళం కాదని రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌ అన్నారు.

ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఎలా పోరాటం చేయాలన్నదానిపై వ్యూహరచన చేస్తున్నామని చంద్రబాబు సూచనలతో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకుంటామని టిడిపి ఎంపీలు వివరించారు. రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు చంద్రబాబుతో విడివిడిగా సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు సభల్లోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి టిడిపి ఎంపీలు సిద్ధమయ్యారు.

అయితే బిజెపితో తమ మిత్రబంధాన్ని తెగ్గొట్టుకోవడానికి తొందరపడటంలేదనీ, పొత్తుల విషయం అధినేత చంద్రబాబు చూసుకుంటారని ఎంపీలు వెల్లడించారు. పొత్తులు కేవలం రాష్ట్రాభివృద్ధికి మాత్రమేననీ, అది జరగనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కొందరు ఎంపీలు స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులకు ఆగస్ట్‌ నెల వేదికగా మారే ఆస్కారముంది.